
మలేషియా స్పీడుకు బ్రేకులు
కాశ్మీర్ పై పాకిస్థాన్ కు వంత పాడిన మలేషియాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతి గణనీయంగా తగ్గించి వేసింది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ఆ దేశం నుంచి మన దేశానికి దిగుమతి అయిన పామాయిల్ మూడవ వంతు పడిపోయింది. స్వాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఇండియా (ఎస్ ఈ ఏ) అనే సంస్థ ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. భారత్ కాశ్మీర్ ను దురాక్రమించిందని ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాంతో మన ప్రభుత్వం మలేషియా నుంచి దిగుమతయ్యే శుద్ధిచేసిన పామాయిల్ పై దిగుమతి సుంకం ఐదు శాతం పెంచింది. మరింత పెంచే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
భారతీయుల స్వదేశాభిమానం
ప్రభుత్వం యొక్క జాతీయ వాద వైఖరి కారణంగానో ఏమో భారతీయ వినియోగదారుల్లో సైతం “స్వదేశీ అభిమానం” మెండుగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. మార్కెట్లో విదేశీ సరుకులు ఎన్ని ఉన్నా సగం మంది వినియోగదారులు స్వదేశీ బ్రాండ్ వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. ఆహార, పర్సనల్ కేర్ ఉత్పత్తుల విషయంలో ఈ అభిమానం మరింత ఎక్కువగా ఉంది. దాదాపు 3000 మంది భారతీయుల అభిప్రాయాలను సేకరించి న బి సి జి అనే అమెరికా సంస్థ ఈ విషయాన్ని వెల్లడి చేసింది. కొన్ని ప్రత్యేక వస్తువుల విషయంలో అయితే భారతీయ వినియోగదారులు దేశీయ కంపెనీల బ్రాండెడ్ వస్తువులే కావాలని కోరుతున్నారట.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





