News

కశ్మీర్‌ ఎన్నటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు: ఫరూక్‌ అబ్దుల్లా

264views

కశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని భారత్‌లోకి ఎగదోయడాన్ని పాక్‌ ఇప్పటికైనా ఆపివేయాలని హితవు పలికారు. న్యూదిల్లీతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలంటే పాకిస్థాన్ ఉగ్ర చర్యలకు స్వస్తి పలకాలని సూచించారు.

‘‘కశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్థాన్‌లో భాగం కాదు. ఇక్కడి ప్రజలు తమ జీవితాలను గౌరవంగా జీవించాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. భారత్‌ హెచ్చరికలను పాకిస్థాన్‌ పెడచెవిన పెడితే.. ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి’’ అని ఫరూక్‌ అబ్దుల్లా దాయాది దేశాన్ని హెచ్చరించారు.

గాందర్‌బల్‌ జిల్లాలోని గుండ్‌ వద్ద శ్రీనగర్‌ – లేహ్‌ జాతీయ రహదారిలో సొరంగ నిర్మాణపనులు చేస్తున్న కార్మికులు, సిబ్బంది ఆదివారం పనులు ముగించుకొని తమ ఇళ్లకు వచ్చిన సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులు మృతిచెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. దీంతో పోలీసు బలగాలు, సైనిక దళాలు ముష్కరుల గాలింపునకు చర్యలు చేపట్టాయి.