News

పాక్‌లో పర్యటన మాత్రమే.. ఆ దేశంతో చర్చల్లేవు: జై శంకర్

4views

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్‌ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌ వేదికగా జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. పాక్‌ పర్యటన గురించి మాట్లాడుతూ ఆ దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని తేల్చిచెప్పారు.

‘‘నేను బహుళపక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నా. భారత్‌-పాకిస్థాన్ సంబంధాలు గురించి మాట్లాడేందుకు కాదు. ఎస్‌సీఓలో సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నా. నేనొక మర్యాదగల పౌరుడిని.. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తాను’’ అని జై శంకర్ వెల్లడించారు. అలాగే సౌత్‌ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్‌ రీజినల్ కో-ఆపరేషన్ లో విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం గురించి ప్రస్తావించారు. ‘‘కొన్ని చిన్న కారణాల వల్ల సార్క్ సమావేశాలు జరగడం లేదు. సార్క్‌లోని ఒక సభ్యదేశం.. ఆ గ్రూప్‌నకే చెందిన దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది’’ అని పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ దేశం చర్యల వల్లే సార్క్ సమావేశాలు ఆగిపోయాయని.. అయితే పూర్తిగా ప్రాంతీయ కార్యకలాపాలు నిలిచిపోయాయని దానర్థం కాదని వెల్లడించారు. ఇంకా చెప్పాలంటూ గత ఐదారేళ్లుగా.. భారత ఉపఖండంలో మరింతగా ప్రాంతీయ సమైక్యత పెరిగిందన్నారు.

ఆయుధ ఉత్పత్తిలో చైనా స్థాయిని అందుకోవాలి
ఈసారి ఎస్‌సీవో సదస్సుకు ఆతిథ్యమిస్తోన్న పాకిస్థాన్‌ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం అందినట్లు ఆగస్టు 30న కేంద్రం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్‌సీఓ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారం తదితర అంశాలపై చర్చించనున్నారు.

కశ్మీర్ సమస్య, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అలాంటి పాకిస్థాన్‌కు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి భారత విదేశాంగ మంత్రి వెళ్తుండటం విశేషం. షాంఘై శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి జైశంకర్‌ నాయకత్వం వహిస్తారని, ఆయన కేవలం ఈ సదస్సు కోసం మాత్రమే వెళ్తున్నారని జైశ్వాల్‌ స్పష్టంచేశారు. గతంలో 2015 డిసెంబర్‌లో అఫ్గానిస్థాన్‌ అంశంపై పాకిస్థాన్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌కు అప్పటి భారత విదేశాంగమంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్‌ హాజరైన విషయం తెలిసిందే.

షాంఘైలో 2001లో జరిగిన శిఖరాగ్ర సదస్సులో ఎస్‌సీవో (SCO) ఏర్పాటైంది. తొలుత ఇందులో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజికిస్థాన్‌, తజికిస్థాన్, ఉబ్జెకిస్థాన్‌లు ఉండగా.. 2017లో భారత్‌, పాకిస్థాన్‌లు శాశ్వత సభ్యత్వం పొందాయి. గతేడాది భారత్‌ ఆతిథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సు సందర్భంగా ఇరాన్‌ శాశ్వత సభ్య దేశంగా చేరింది.