News

అమర్‌నాథ్‌ యాత్ర రికార్డులు బద్దలు!

55views

అమర్‌నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్‌నాథ్‌ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్‌నాథ్‌ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.

జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.

అమర్‌నాథ్‌ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. జమ్మూలోని యాత్రి నివాస్‌, చంద్రకోట్‌ యాత్రి నివాస్‌, శ్రీనగర్‌లోని పాంథా చౌక్‌లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్‌నాథ్‌ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.

సంవత్సరం యాత్రికుల సంఖ్య
2011 – 6.34 లక్షలు

2012 – 6.22 లక్షలు

2013 – 3.53 లక్షలు

2014 – 3.73 లక్షలు

2015 – 3.52 లక్షలు

2016 – 2.20 లక్షలు

2017 – 2.60 లక్షలు

2018 – 2.85 లక్షలు

2019 – 3.42 లక్షలు

2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.

2022 – 3.04 లక్షలు

2023 – 4.50 లక్షలు

2024 – ఇప్పటివరకు 5.10 లక్షలు