News

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్

36views

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల బోణీ కొట్టింది. భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 221.7 పాయింట్లతో మను భాకర్ మూడవ స్థానంలో నిలవగా.. దక్షిణకొరియాకు చెందిన వైజే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది. తన దేశానికి వైజే కిమ్ 241.3 పాయింట్లతో రజతం గెలుచుకుంది. టైటిల్ పోరులో మను భాకర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. దీంతో ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌ కేటగిరిలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచింది. అందులోనూ భారత్ అందుకున్న తొలి పతకం కావడంతో ఆమె పేరు మార్మోగుతోంది.

భారత్ చివరిసారిగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకాన్ని గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో గగన్ నారంగ్ కాంస్యం, పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో విజయ్ కుమార్ రజతం సాధించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారత్ పతకం గెలిచింది.

ఇక పారిస్ ఒలింపిక్స్ రెండవ రోజున మరికొందరు అథ్లెట్లు అదరగొట్టారు. పతకాలపై ఆశలు రేపారు. అర్జున్ బాబుటా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. రమితా జిందాల్ కూడా కూడా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. వీరిద్దరూ పతకాలపై ఆశలు పెంచుతున్నారు. ఇక భారత రోయర్ బల్‌రాజ్ పురుషుల సింగిల్ స్కల్స్‌లో రెండవ స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.