News

కళ్యాణ కట్టలో పరిశుభ్రత మెరుగవ్వాలి -⁠ ⁠టీటీడీ ఈవో

57views

శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో
జె.శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టను ఈవో, జేఈఓ గౌతమితో కలిసి కళ్యాణకట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

కళ్యాణ కట్టలో ఇంకను శుభ్రపరచని తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాత్ రూంలు, ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు, వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే విరిగిన నీటి కొళాయిలు, పనిచేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

అనంతరం ఈవో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు. టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.