News

బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు 1000 మంది విద్యార్థులు..చిక్కుకుపోయిన 4000 మంది

39views

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై జరగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటయోధుల కుటుంబాలకు చెందిన వారికి 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, పలు వర్సిటీల విద్యార్థులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ రిజర్వేషన్లు ఎత్తేసి మెరిట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హింసలో దాదాపుగా 115 మంది మరణించారు. ప్రస్తుతం షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది.

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్ భారత్-బంగ్లాదేశ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పౌర విమానయానం, ఇమ్మిగ్రేషన్, ల్యాండ్ పోర్ట్‌లు మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)తో కూడా భారతీయ పౌరులకు సాఫీగా వెళ్లేందుకు సహకరిస్తోంది. ఇప్పటి వరకు 778 మంది భారతీయులు భూమార్గం ద్వారా, 200 మంది విద్యార్థుల వరకు ఢాకా, చిట్టగాంగ్ విమానాశ్రయాల ద్వారా భారత్ చేరినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న మరో 4000 మంది భారతీయలు అక్కడే చిక్కుకుపోయారు. వీరితో భారత హైకమిషన్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. నేపాల్, భూటాన్ అభ్యర్థన మేరకు ఆ దేశాలకు చెందిన విద్యార్థులను కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్నారు.