ArticlesNews

త్రివర్ణ పతాక తపశ్శాలి పింగళి వెంకయ్య

73views

( జూలై 4 – పింగళి వెంకయ్య వర్ధంతి )
అన్ని కళలకు ఆలవాలమై, ఎన్నో వందల సంవత్సరాల అద్భుతమైన నాగరికతతో కూడిన వైభవంతో విలసిల్లిన భరతఖండం, పరదేశీ రాజ్యకాంక్షకు బలై తన ప్రాభవాన్ని కోల్పోవడమే కాకుండా దాసీలుగా బతికే పరిస్థితికి రావడం కూడా జరిగింది. ఇది చరిత్ర. అయితే మన సంస్కృతిని కాపాడుకోవడానికి, మన ఉనికిని మరల సముపార్జించుకోవడానికి, మొక్కవోని ధైర్యంతో ఎదురొడ్డి పోరాడి, అహింసా మార్గంలో మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడమే కాకుండా దానికి సరికొత్త రూపకల్పన చేయడంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, రూపకర్తలు భాగస్వాములయ్యారు. వారందరి అవిరళ కృషి, దేశభక్తి, త్యాగనిరతి నేడు మనందరం అనుభవిస్తున్న స్వతంత్ర భారత ఆధునిక నాగరిక జీవన విధానం. మరి అటువంటి వారిని అప్పుడప్పుడు స్మరించుకోవడం మన కనీస ధర్మం. ఆంగ్లేయుల పాలననుండి విముక్తి పొంది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన భారతదేశ ఉనికిని చూపే జాతీయ పతాకం ఎంతో అవసరం. అటువంటి జాతీయ జెండా రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించి త్రివర్ణ పతాకాన్ని అన్ని వర్గాలు మెచ్చుకొనే విధంగా తయారుచేసి అందించిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్యగారు.

నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1876, ఆగస్టు 2న పింగళి వెంకయ్యగారు జన్మించారు. తన ప్రాధమిక, ఉన్నత విద్యానంతరం భూగర్భ శాస్త్రవేత్తగా గుర్తింపు పొంది మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక మంచి జాతీయ జెండా ఉండాలనే తపనతో మూడు సంవత్సరాలు అనేక దేశాల జాతీయ పతాకాలను విశ్లేషించి, 1916లో ‘ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే బుక్‌లెట్‌ను ప్రచురించారు. ఇందులో దాదాపు ముప్పై రకాల పతాకాల మూల నమూనా పొందుపరచడం జరిగింది.

ఎన్నో అవరోధాలను అన్నింటినీ త్రికరణ శుద్ధితో అధిగమించి నేటి మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారు అందుకోసం దశాబ్దకాలం శ్రమించాడు. తన ఆలోచనలన్నీ జాతీయ జెండా ఎలా ఉండాలనే విషయం మీదే ఉంచి, ప్రముఖుల అభిప్రాయాలను స్వీకరించి ఆ పిమ్మట తన ఆలోచనలకు ఒక రూపం కల్పించారు. కనుకనే మన జాతీయ జెండా ‘త్రివర్ణ పతాక’మై నేటికీ రెపరెపలాడుతున్నది. మన జాతీయ జెండాలోని మూడు రంగులు సర్వమతాల సమ్మేళనాన్ని ప్రతిబింబించగా, మధ్యలోని అశోక ధర్మ చక్రం మన సంస్కృతికి చిహ్నమై అలరారుతున్నది. స్వాతంత్ర్యానికి ముందు ఆ ధర్మ చక్రం స్థానంలో రాట్నం ఉండి గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింపజేసేది. ఏ దేశమైనా సుభిక్షంగా ఉండాలి అంటే అక్కడి ప్రజలకు ఆహారాన్ని అందించే రైతన్న సుఖసంతోషాలతో విలసిల్లాలి. అటువంటి మంచి సందేశాన్ని మన వెంకయ్య గారు తను రూపొందించిన జెండా ద్వారా చెప్పకనే చెప్పారు.

నిస్వార్థంతో అతి సాధారణమైన జీవితాన్ని గడిపిన పింగళి వెంకయ్య గారు చేసిన సేవ అనితరము. వెంకయ్య గారు తన వృద్ధాప్యంలో ఆర్ధిక సమస్యలతో సరైన సహాయం అందక ఎన్నో ఇబ్బందులు పడి తన ఎనభై ఆరో ఏట అంటే 1963 జూలై 4న పరమపదించారు. మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం..భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు.. అక్షర సత్యం. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారు చరితార్థులు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం.