News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం

88views

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. నారాయణ్ పుర్ – దంతేవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్ అటవీ ప్రాంతంలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టుల కదలికల సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ITBP)తో కలిసి జాయింట్ ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లపై కాల్పులు జరిపారు. మృతులను నారాయణ్‌పుర్‌, దంతేవాడ, బస్తర్‌, కొండగావ్‌ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 122 మంది మావోయిస్టులు మృతి చెందారు. మే 23న నారాయణ్‌పుర్‌, బీజాపుర్‌ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంపై మాట్లాడారు. జార్ఖండ్, బీహార్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైందని.. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు, నాలుగు జిల్లాల్లో ఈ సమస్య కొనసాగుతోందని అన్నారు. దాన్ని అణచివేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.