ArticlesNews

పంచభూతాల మధ్య సమతుల్యత కాపాడాల్సింది మనమే… విస్మరించరాదు : విశ్వ యోగి విశ్వంజీ

Cover / Wallpaper Design
82views

మనం భూమాతను అంటే పృథ్వీ మాతను ఆరాధించాలి. సంరక్షించుకోవాలి. పృథ్వీ మాతను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. పృథ్వీ మాతను సంరక్షించుకుంటే ఈ భూమిపై వున్న 84 లక్షల జీవరాసులు బాగుంటాయి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో పృథ్వీమాతకు ఆపద ఏర్పడుతోంది. ‘‘పృథీశాంతి:, ఆపశ్శాంతి: అంటూ మన వేదాలు చెబుతున్నాయి. పంచభూతాలు శాంతింగా వుండాలంటే ఈ భూమండలం చక్కగా వుండాలి. అందుకే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై వుంది. పంచభూతాలు కలుషితం అయితే ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది.

ప్రకృతి పూజించడమంటే భగవంతుడ్ని పూజించడమే. హిమాలయాల్లోని ‘‘చార్‌ధామ్‌’’ క్షేత్రాలు అతిపవిత్రమైనవి. ఈ క్షేత్రాల్లో వేల సంవత్సరాల నుంచి రుషులు తపస్సు చేస్తూ, పృథ్వీమాత రక్షణ కోసం పాటుపడుతూ వస్తున్నారు. ప్రకృతికి అనుగుణంగా వేల సంవత్సరాల నుంచి మనుషులు జీవిస్తూ వస్తున్నారు. పంచభూతాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఇంతకాలం చూస్తూ వుండటం వల్ల గతంలో ఏనాడూ ఉత్పాతాలు జరిగినట్లు దాఖలాల్లేవు. ఏనాడూ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.

సహజంగా వుండే పర్వతాలను, హిమాలయాలను తొలచివేస్తున్నాం. నదీ ప్రవాహాలు సజావుగా కొనసాగకుండా అడ్డుకుంటున్నాం. అడవులను తొలగిస్తున్నాం. పవిత్రమైన గంగను కూడా కలుషితం చేశాం. ఈ కారణాల వల్ల ప్రకృతిలో సమతుల్యత దెబ్బతిన్నది. ప్రశాంతత ఉండాల్సిన చోట బీభత్సం చోటు చేసుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ప్రకృతి వైపరీత్యాలను చూడాలి. ప్రకృతి మనపై యుద్ధం ప్రకటిస్తే, మనం నిలువలేం. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం వుంది.