News

పాక్‌ కోసం గూఢచర్యం.. బ్రహ్మోస్‌ మాజీ ఇంజనీర్‌కు జీవిత ఖైదు

88views

పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు క్షిపణి రహస్యాలను చేరవేసిన కేసులో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఇంజనీర్‌ నిశాంత్‌ అగర్వాల్‌కు జీవిత ఖైదు పడింది. దాంతోపాటు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ నాగపూర్‌ జిల్లా కోర్టు జడ్జి ఎంవీ దేశ్‌పాండే సోమవారం తీర్పునిచ్చారు. డీఆర్‌డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్‌ కన్సార్షం సంయుక్తంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిశాంత్‌ అగర్వాల్‌ 2014 నుంచి ఆ సంస్థలోని సాంకేతిక విభాగంలో పనిచేశాడు. అతను బ్రహ్మోస్‌కు చెందిన రహస్యాలను ఐఎస్‌ఐకు చేరవేసినట్లు మిలటరీ ఇంటెలిజెన్స్‌ గుర్తించింది. 2018లో మిలటరీ ఇంటెలిజెన్స్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద నిరోధక బృందాలు(ఏటీఎస్‌) సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి, నిశాంత్‌ను అరెస్టు చేశాయి. సీఆర్పీసీతోపాటు, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(ఎఫ్‌), అధికారిక రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతనికి నాగపూర్‌ జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జ్యోతి వాజాని వాదనలను వినిపించారు. పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి ఎంవీ దేశ్‌పాండే.. దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించిన ఆధారాలు, వాదనలతో ఏకీభవిస్తూ.. సోమవారం తుది తీర్పును వెలువరించారు. నిశాంత్‌కు జీవిత ఖైదుతోపాటు.. 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 3 వేల జరిమానా విధించారు.