
గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా మాల్దీవుల మంత్రి మండలి నిషేధం విధించిన నేపథ్యంలో మన దేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసింది. భారత్లోని బీచుల్లో పర్యటించండని తమ దేశ పౌరులకు సూచించింది. ‘‘ఇజ్రాయెల్ పర్యటకులపై మాల్దీవులు నిషేధం విధించాలని యోచిస్తోన్న తరుణంలో.. భారత్లోని కొన్ని బీచ్ల వివరాలు మీకోసం. వాటి వద్ద మీకు ఆత్మీయ స్వాగతం లభిస్తుంది. అద్భుతమైన ఆతిథ్యం ఉంటుంది. మన దౌత్యవేత్తలు చేసిన పర్యటనల ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నాం’’ అంటూ ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం స్పందించింది. లక్షద్వీప్, గోవా, అండమాన్, నికోబార్ దీవులు, కేరళలోని బీచ్ల ఫొటోలను షేర్ చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి షొషాని మరో పోస్టు పెట్టారు. దానికి జనవరిలో మోదీ లక్షద్వీప్ పర్యటన ఫొటోలను జత చేశారు. ‘‘మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ధన్యవాదాలు. ఇప్పుడు మా ప్రజలు భారత్లోని అందమైన బీచ్ల్లో పర్యటిస్తారు’’ అని పేర్కొన్నారు.





