News

భక్తుడి కోసం వెనుతిరిగిన భగవంతుడు

66views

భగవంతుడు భక్తప్రియుడు. భాగవతుల హృదయమే ఆయనకు మందిరం. తనను నమ్మినవారిని తప్పకుండా రక్షిస్తాడు. పురాణేతిహాసాలు ఈ విషయాన్ని కథల రూపంలో మనసుకు హత్తుకునేలా వివరించాయి.

రామదాసు, కనకదాసు- ఇద్దరూ భక్తులే. ఒకరు రాముణ్ణి, ఇంకొకరు కృష్ణుణ్ణి నమ్ముకున్నారు. ఉడుపి బాలకృష్ణుణ్ణి కనులారా చూసి ఆనందించాలి అనుకున్న కనకదాసు బయల్దేరాడు. ఆనాటి ఆచారాలను బట్టి ఆయనకు దేవాలయ ప్రవేశం కలగలేదు. జాత్యహంకారులు కనకదాసును కట్టేసి, కనీసం నోరారా శ్రీకృష్ణుని పిలవడానికి వీల్లేకుండా హింసించారు. అయినా కనకదాసు వెనకాడలేదు. గళమెత్తి పాడాడు. ప్రహ్లాదకుమారుణ్ణి తండ్రి హిరణ్యకశిపుడు ‘ఏడీ శ్రీహరి?’ అని గర్జించగా.. ఇందు గలడు, అందు లేడు అనే సందేహం లేకుండా నరహరిగా ప్రత్యక్షమయ్యాడు సర్వాంతర్యామి అయిన శ్రీహరి. లోకకంటకుడైన హిరణ్యకశిపుని తుదముట్టించి, తన భక్తుణ్ణి రక్షించాడు. ఇక గజేంద్రుడు మొసలినోట చిక్కి ‘నువ్వే నాకు దిక్కు’ అని మొరపెట్టుకున్నాడు. వెంటనే వైకుంఠం నుంచి హరి దిగివచ్చి ఏనుగును మొసలి బారినుంచి రక్షించి, మోక్షప్రాప్తి కలిగించాడు.

కనకదాసు కూడా ఆ గజేంద్రుడిలా నీవే శరణని ప్రార్థించాడు. ‘దేవా! తలుపు తీసి, నీ దర్శనభాగ్యం కలిగించు’ అని ఎలుగెత్తి పిలిచాడు. ఆలయంలో ఘనంగా పూజలు జరుగుతున్నాయి. ఇంతలో ఒక వింత జరిగింది. అడ్డుగోడ బద్దలయ్యింది. స్వామి వెనుదిరిగి.. కనక దాసుకు దివ్యరూప సందర్శనం ప్రసాదించాడు. కరిరాజు కోసం హడావుడిగా విష్ణువు బయల్దేరినప్పుడు.. వైకుంఠపురంలోని పరివారం అంతా కదిలి వచ్చినట్లు ఉడుపి క్షేత్రంలోని కృష్ణ విగ్రహం తిరిగిన దిశలో హారతి పళ్లేలు, తీర్థప్రసాదాలు మలుపు తిరిగాయి. గుడిగంటలు గణగణ మోగాయి. భక్తి మహిమ ప్రపంచానికి మరోసారి నిరూపితమైంది. భక్తి ఉన్నచోట జ్ఞానవైరాగ్యాలూ ఉంటాయి. భక్తులు జీవన్ముక్తులు అవుతారు.