News

దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు నేరుగా శ్రీవారి ఉచిత దర్శనం

133views

తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
వృద్ధులు, దివ్యాంగుల కోసం రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్‌ను ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఆలయం బయట గేట్ దగ్గరి పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది.

వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో ఇతర క్యూలు నిలిపివేస్తారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావచ్చని తెలిపారు. అలాగే స్వామివారిని దర్శనం చేసుకునే వృద్ధులు, దివ్యాంగులు రూ.20 చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. వృద్ధులకు వయసు 65 సంవత్సరాలు పూర్తై ఉండాలని తెలిపింది.