News

కన్యాకుమారిలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ధ్యానం

74views

లోక్‌సభ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, ప్రచారం ముగిసిన ప్రాంతాల్లో పార్టీ నేతలు, అభ్యర్థులు పూర్తి రెస్ట్‌లోకి వెళ్లిపోయారు. కొందరు కుటుంబీకులతో గడుపుతుంటే… మరి కొందరు విదేశీ పర్యటనలు, పర్యటనలకు పయనమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అలసిపోవడంతో కాస్త విశ్రాంతి కోసం ఇలా చేస్తున్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. చాలా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకోవడంతో ఆయన రెండు రోజుల పాటు అంటే 48 గంటల పాటు నిర్విరామంగా ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఈ ధ్యానం చేసుకోవడానికి ఆయన కన్యాకుమారిలో వున్న స్వామి వివేకానంద రాక్‌ మెమోరియల్‌ ను ఎంచుకున్నారు. ఈ నెల 30, జూన్‌ 1వ తారీఖుల్లో మోదీ నిరంతరాయంగా ధ్యానంలో వుండనున్నారు. ధ్యాన మండపంలోనే గడుపుతారు.

అప్పట్లో ఇక్కడే ధ్యానం చేసి… దేశం గురించి ఆలోచించిన స్వామి వివేకానందుడు
శివుడి కోసం ఎదురు చూస్తూ పార్వతీ దేవి ఒంటి కాలుపై కన్యాకుమారిలోనే ధ్యానం చేసిందని పురాణాలు చెబుతుంటాయి. అలాగే ఆధునిక కాలంలో స్వామి వివేకానందుల వారు కూడా కన్యాకుమారి రాక్‌ మెమోరిల్‌కి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. స్వామి వివేకానందుల వారు ఇక్కడే ధ్యానం చేశారు. ఈ ధ్యానం తర్వాతే స్వామి వివేకానందకు తన కర్తవ్యం బోధపడిరది. భారత దేశ నిర్మాణం కోసం ఏం చేయాలో ఇక్కడే ఆయన నిర్ణయించుకున్నారు. వీటన్నింటి ప్రాధాన్యత రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ రాక్‌ మెమోరియల్‌ను ఎంచుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కాషాయం చుట్టుకొని కేదారనాథ్‌ గుహలో ధ్యానం చేసుకున్నారు.