74
తిరుమలలోని అంజనాద్రి ఆకాశగంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమజ్జయంతిని జూన్ ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంజనాద్రి ఆలయంలో.. ఆకాశగంగలోని అంజనాదేవి–బాలాంజనేయస్వామి ఆలయంలో ఐదురోజుల పాటు ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం చేయనున్నారు. జపాలిలో రోజూ మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. అదే విధంగా నాదనీరాజనం వేదికపై ఈ ఐదురోజులు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు హనుమాన్ జననం, హనుమంతుడికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన అంశాలపై ప్రముఖ వేదపండితుల ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి.