
బెంగళూరువాసులు బుధవారం ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది.
జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది.ఆరోజు సూర్య కిరణాలు నేరుగా తలపై పడతాయి. సూర్యుడి కోణం భూమి ఉపరితలంపై లంబంగా ఉన్నప్పుడు భూమధ్యరేఖ సమీపంలో ఉన్న ప్రాంతాలలో ఇది ఏర్పడుతుంది.
జీరో షాడో డే అంటే..
ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) ప్రకారం.. జీరో షాడో డే +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న అన్ని ప్రదేశాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు నిట్ట నిలువునా తలపై పడతాయి. కానీ కొంచెం తక్కువ ఎత్తులో, ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపునకు కిరణాలు ప్రసరిస్తాయి. ఫలితంగా భూమిపై జీరో షాడో ఏర్పడుతుంది. ఈ రెండు రోజులలో సూర్యుడు సరిగ్గా తలపై ఉంటాడు.
భూమిపై ఇలాంటి వింత సంఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి వీటిలో ఒక భాగమే. జీరో షాడో డే కూడా అలాంటిదే. వాస్తవానికి ఆరోజు సూర్యుడు నేరుగా మన నడినెత్తిపై ఉన్నప్పుడు, ఆ కిరణాలు నిలువుగా మనపై పడతాయి. దానివల్ల మన నీడ వేరోచోట వ్యాపించకుండా పూర్తిగా మన పాదాల కిందనే ఏర్పడుతుంది.
దీనివల్ల నిటారుగా నిలబడితే నీడ కనిపించదు. ఈ ప్రత్యేక పరిస్థితి భూమి భ్రమణ అక్షం వంపు కారణంగా ఏర్పడుతుంది. 2023 ఏప్రిల్ 25న బెంగుళూరుతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీరో షాడో డే అనేది ఉష్ణమండలం మధ్యలో ఉన్న ప్రదేశాలలోనే సంభవిస్తుంది.





