News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు

61views

ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టిటిడి ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల క్రతువుకు ఆగమశాస్త్రం ప్రకారం మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 10.30 వరకు ధ్వజారోహణ సేవ జరిగింది. రాత్రి 7 గంటలకు శేష వాహనంపై సీతారాములు విహరించనున్నారు.

ఈ నెల 22న సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 23న రథోత్సవం, 25న చక్రస్నానం, ధ్వజావరోహణం, 26న పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తులకు మౌలిక సదుపాయల కల్పన, తాగునీరు, మజ్జిగ సరఫరా, ఇతర పనులకు రూ.3 కోట్లు, విద్యుత్తు వెలుగులకు రూ.కోటి వెచ్చిస్తుండగా, జానకిరాముల పరిణయ వేడుకలకు 100 కిలోల ముత్యాలు వినియోగించనున్నారు. ఈ సారి 1.20 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్‌బాబు తెలిపారు. బ్రహ్మోత్సవాల పర్యవేక్షణ బాధ్యతలను తితిదే పాలకమండలి విభాగం డిప్యూటీ ఈవో ప్రశాంతికి అప్పగించారు.