News

పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌.. చేసింది ఎవరంటే..?

288views

బలూచిస్థాన్‌లోని మిలిటెంట్‌ గ్రూప్‌పై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జరిపిన దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాక్‌ భూభాగంలో ఇరాన్‌ మరోసారి మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడిలో ఉగ్రసంస్థ ‘జైష్‌ అల్‌ అదిల్‌’ కమాండర్‌ ఇస్మాయిల్ షాభక్ష్‌ హతమైనట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. అతడి అనుచరులు కొందరిని కూడా అంతమొందించినట్లు పేర్కొంది.

గత నెల కూడా ఇరాన్ ఈతరహా దాడులు చేసింది. బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ‘జైష్‌ అల్‌ అదిల్‌’ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఆ మరుసటిరోజే పాక్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్‌లోని సిస్థాన్‌-ఒ-బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘జైష్‌ అల్‌ అదిల్‌’ సున్నీ మిలిటెంట్‌ గ్రూపు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్‌లోని సిస్థాన్‌-బలూచిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో హమాస్‌-ఇజ్రాయెల్‌ ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇరాన్‌-పాక్‌ ఘర్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.