
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఉత్తరభారతదేశంలో హిందువులు జరుపుకునే ‘మాఘ మేళా’లో నాలుగవ పవిత్రస్నానం చేసే పండుగ ఇది.
గంగ, యమున, సరస్వతీ నదుల సంగమక్షేత్రం ప్రయాగరాజ్ వద్ద భక్తులు పూజలు చేసారు. ఇక్కడ సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని ప్రజల విశ్వాసం. విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవిని పూజిస్తే పిల్లలకు చదువులు బాగా వస్తాయని నమ్ముతారు. గంగాతీరంలోని పవిత్ర క్షేత్రాల్లో కూడా భక్తులు పవిత్ర మాఘస్నానం చేసారు.
వసంత పంచమి సందర్భంగా వేకువజామునే భక్తులు పవిత్రస్నానాలకు పోటెత్తారు. వేలకొద్దీ భక్తులు రావడంతో స్నానఘట్టాల దగ్గర భద్రతా ఏర్పాట్లు చేసారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాలతో త్రివేణీ సంగమ క్షేత్రం మొత్తం ప్రాంతాన్ని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. స్నానఘట్టాల దగ్గర మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.





