
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే విషయంపై రష్యా మరోసారి సానుకూలత తెలిపింది. యూఎన్ఎస్సీలో చోటు పొందేందుకు ఢిల్లీకి అన్ని అర్హతలు ఉన్నాయని రష్యా పేర్కొంది.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావించిన డెనిస్ అలిపోవ్, భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంతో గ్లోబల్ సౌత్ అభివృద్ధికి సహయపడుతుందన్నారు.
ఢిల్లీకి ప్రస్తుతం శాశ్వత సభ్యత్వం లేనప్పటికీ గతంలో తాత్కాలిక సభ్యత్వంతో భద్రతా మండలికి రెండు సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలను ‘ఢిల్లీ డిక్లరేషన్’ వేళ ఏకతాటిపై నడిపించడమే భారత్ సమర్థతకు నిదర్శనమని కొనియాడారు.
ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలు గ్రూపులుగా విడిపోవడంతో భద్రతా మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు ఎటూ తేలడం లేదని చెప్పిన రష్యా రాయబారి డెనిస్, ఇప్పటికే పశ్చిమ దేశాలకు అత్యధిక ప్రాధాన్యం లభించిందన్నారు.





