
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేత సందర్భంగా చోటుచేసుకున్నహింసలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు సహా ఏడుగురు చికిత్స పొందుతుండగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగకపోవడంతో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ లోని ఓ ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మదార్సా, మసీదు నిర్మించారు. దీనిని తొలగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది చేరుకోగా స్థానికులు అడ్డుకోవడంతో హింస రేగింది. చుట్టపక్కల భవనాలపైకి ఎక్కిన స్థానికులు పోలీసులు, మున్సిపల్ సిబ్బందిపై రాళ్ళతో దాడి చేశారు.
రాళ్ళు, కర్రలు, పెట్రోలు బాంబులతో అధికారులను బెదిరించారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. మరోగుంపుగా పోగైన ఆందోళనకారులు, పోలీసులను వెంబడించారు. దీంతో పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో దలదాచుకోగా అక్కడ ఉన్న ద్విచక్ర వాహనలకు ఆందోళనకారులు నిప్పుబెట్టారు.
పోలీస్ స్టేషన్ కు కూడా నిప్పుబెట్టేందుకు ఆందోళన కారులు ప్రయత్నించగా లోపలున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ తెలిపారు. దాడులకు తెగబడిన 20 మందిలో నలుగురిని గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు.





