
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్లో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల స్థలాలను హైకోర్టు నిర్మాణానికి కేటాయించవద్దని కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు బుధవారం అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్-ఏబీవీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. రాజేంద్రనగర్లోని వర్సిటీకి భారీగా తరలివచ్చిన పరిషత్ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలో రాజేంద్రనగర్ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పోలీసులను తప్పించుకొని పరుగెత్తే ప్రయత్నం చేయగా ద్విచక్రవాహనంపై వెంబడించిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుట్టుపట్టుకొని లాగడంతో ఆమె కింద పడిపోయారు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు.




