
వ్యక్తుల జీవితాల కోణంలో అధ్యయనం చేస్తే మహాభారతాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం లేదని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విజయవాడలో కేతు విశ్వనాథ రెడ్డి సాహిత్య వేదికపై నిర్వహించిన పుస్తక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చాగంటి ‘శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం’ గ్రంథాన్ని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు(Former High Court judge Justice Somayajulu) ఆవిష్కరించారు. నేటి భారతంలో మహాభారత ప్రస్తావనార్హత అనే అంశంపై చాగంటి ప్రసంగించారు.
“వ్యక్తుల జీవితాల కోణంలో అధ్యయనం చేస్తే మహాభారతాన్ని మించిన వ్యక్తిత్వ వికాస గ్రంథం లేదు. మహాభారత పుస్తక పఠనం వల్ల నిజ జీవితంలో మానవీయ విలువలు పెరుగుతాయనే నమ్మకంతోనే రాజరాజనరేంద్రుడు వ్యాసభారతాన్ని తెనిగించే పనికి సంకల్పించారు. సామాన్యులకు వేదధర్మం మర్మం సులువుగా అందించడానికే వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. మానవులలోని అంతరంగ సంస్కారాన్ని పరిణతి చెందించే శక్తి సంస్కృతికి ఉంది.”
– చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కర్త





