News

అంతరిక్షంలో ఇస్రో ఫ్యూయెల్‌ సెల్‌ పరీక్ష విజయవంతం

226views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యూయెల్‌ సెల్‌ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్‌’లో ప్రకటించింది. భారత అంతరిక్ష కార్యకలాపాల భవిష్యత్తు మిషన్ల కోసం దీనిని అభివృద్ధి చేశారు. ‘పాలిమర్‌ ఎలక్ట్రోలైట్‌ మెంబ్రేన్‌ ఫ్యూయెల్‌ సెల్‌’గా దీనిని వ్యవహరిస్తున్నారు. ఇది రసాయన చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో నీటిని మాత్రమే వదులుతుంది. హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ వాయువుల నుంచి రసాయన చర్య జరిపి 180 వాట్ల శక్తిని విడుదల చేస్తుంది.

పీఎస్‌ఎల్‌వీ-సీ58తో ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం ‘ఎక్స్‌పోశాట్‌’ను ఇస్రో పంపిన విషయం తెలిసిందే. ఇదే రాకెట్‌లో మరో పది పరికరాలనూ అంతరిక్షంలోకి పంపింది. వాటిలో ఫ్యూయెల్‌ సెల్‌ పవర్‌ సిస్టమ్‌ కూడా ఒకటి.