News

నూతన రామాలయంలోకి ఇలా ప్రవేశించి..

261views

సనాతన సంప్రదాయంలో శ్రీరాముడు ఆదర్శ పురుషునిగా కనిపిస్తాడు. అయోధ్యలో నిర్మితమవుతున్న శ్రీరాముని ఆలయం సనాతన విలువలకు ప్రతిబింబంగా నిలుస్తుంది. నాగర్ శైలిలో నిర్మితమవుతున్న రామాలయ ప్రాంగణంలో దక్షిణ ద్రావిడ శైలి ప్రభావం కూడా కనిపిస్తుంది. పంచాయతన సంప్రదాయమూ దర్శనమిస్తుంది.

నూతన రామాలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశం ఉంటుంది. 33 మెట్లు ఎక్కిన తర్వాత భక్తులు ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఆలయ ప్రదక్షిణ, దర్శనం తరువాత భక్తులు దక్షిణ దిశ నుండి నిష్క్రమణ కావాలని ఉంటుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన రామాలయ విశేషాల గురించి తెలియజేసింది. మొత్తం ఆలయ సముదాయం 70 ఎకరాలు. ఇందులో 25 నుంచి 30శాతం స్థలంలో మాత్రమే ఆలయం నిర్మితమవుతోంది. మిగిలిన ప్రాంతం పచ్చదనంతో కూడి ఉంటుంది.

2024 జనవరి 22న ప్రధాని మోదీ.. ఆలయంలోని బాలరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన చేసే సమయానికి గ్రౌండ్ ఫ్లోర్, తూర్పు ప్రధాన ద్వారాలు సిద్ధం కానున్నాయి. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్ ఉంటుంది. పూజలు, ప్రార్థన, భజనలకు ఐదు మంటపాలు నిర్మిస్తున్నారు. ఆలయ సముదాయంలో మొత్తం 44 ద్వారాలు ఉండనున్నాయి.

ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ ఆలయ సముదాయంలో మౌలిక సదుపాయాలు విరివిగా ఉంటాయన్నారు. నీటి శుద్ధి కేంద్రం, అగ్నిమాపక కేంద్రం కూడా ఉంటాయన్నారు. భక్తుల కోసం సుమారు 25 వేల లాకర్లు ఏర్పాటు చేస్తున్నమని, ఇక్కడ సామాను ఉచితంగా ఉంచుకోవచ్చన్నారు.

నూతన ఆలయం నాగర్ శైలిలో ఉంటుందని, ఇది ఉత్తర భారత దేవాలయాల ప్రత్యేకశైలి అని చెప్పారు. అలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారని, ఇది దక్షిణ దేవాలయాల నిర్మాణ శైలికి ఉదారహణ అని తెలిపారు. ఆలయ నలుమూలల్లో సూర్య భగవానుడు, గణపతి, శివుడు, భగవతి అలయాలు ఉంటాయని, మధ్యలో బాలరాముడు కొలువుదీరుతాడన్నారు.