
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గిరిప్రదక్షిణ నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కోసం ధర్మప్రచారానికి వేదపండితుల మంత్రోచ్చారణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ గిరిప్రదక్షిణ ఉత్సాహంగా సాగింది. కామధేను అమ్మవారి ఆలయం వద్ద స్వామి, అమ్మవార్లకు ఆలయ స్థానాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో కె.ఎస్. రామరావు కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఈరోజు సాయంత్రం కలశ జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పౌర్ణమి రోజు స్వర్ణ కవచాదేవి అవతారంలో ఉండే అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. డప్పులు, బేతాల నృత్యాలు, ఇతర కార్యక్రమాలతో గిరిప్రదక్షిణ కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.





