News

అది సీక్రెట్ ఆప‌రేష‌న్.. 90 సెక‌న్ల‌లో పూర్తిచేశాం!

934views

ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడికి నిరసనగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక ద‌ళం దాడి చేసిన విషయం తెలిసిందే. 48 ఏళ్ల తరువాత పాక్ భూభాగం బాలాకోట్‌లో అడుగెట్టిన భారత వాయు సేన.. ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి విజయవంతంగా వెనుదిరిగింది. ఈ దాడుల్లో ఎంతమంది మరణించారన్న దానిపై స్పష్టత రాకపోయినప్పటికీ.. భారత జవాన్ల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవడంలో భారత్ విజయం సాధించింది.

ఇదిలావుంటే.. అత్యంత రహస్యంగా జరిగిన ఈ దాడుల గురించి తాజాగా భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలెట్లు కొన్ని వివరాలను మీడియాతో పంచుకున్నారు. కేవలం 90సెకన్లలో తమ మిషన్‌ను పూర్తి చేసుకొని వచ్చామని వారు తెలిపారు. పుల్వామా ఘటన తరువాత జైషే మహ్మద్ పని పట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బాలకోట్‌ ఉగ్ర శిబిరాన్ని టార్గెట్ చేశాం. దాడికి సరిగ్గా రెండు రోజుల ముందు నుంచి భారత్- పాక్ సరిహద్దులకు అత్యంత దగ్గరగా కాంబాట్ ఎయిర్ పెట్రోల్‌లు పెంచారు. పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తప్పుదోవ పట్టించేందుకు వాటి ఉద్ధృతిని పెంచామని ఓ పైలెట్ అన్నారు.

ఇక.. దాడికి కొన్ని గంటల ముందుగా ఫిబ్రవరి 25వ తేదిన సాయంత్రం 4గంటలకు స్పైస్-2000 బాంబులను బయటికి తీసి, వాటిని మిరాజ్-2000 యుద్ధ విమానాలకు అమర్చామని.. అనంతరం బాలకోట్ ఉగ్ర క్యాంప్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆ స్మార్ట్ బాంబ్‌లో నిక్షిప్తం చేశామని మరో పైలెట్ తెలిపారు.

ఆ తర్వాత‌.. ఫిబ్రవరి 26వ తేదిన తెల్లవారుజామున 2గంటల సమయంలో ఇంధనాన్ని నింపుకున్న యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు కశ్మీర్‌కు చేరగానే రేడియో సైలెన్స్ పాటించాయి. ఈ విమానాలకు రక్షణ కల్పించడానికి.. ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించడానికి సుఖోయ్-30 ఎంకేఐ విమానాల బలగం కూడా బయల్దేరింది. మాకు మార్గనిర్దేశం కోసం అవాక్స్ విమానం, గాల్లో ఇంధనం నింపేందుకు మరో ట్యాంకర్ విమానం కూడా గాల్లోకి ఎగిరాయి. మరోపక్క ఎవరికీ అనుమానం రాకుండా మా అధికారులు రోజువారీ పనులను యథావిధిగా నిర్వహించారు అని పైలెట్ వివరించారు.

కాగా.. బాలకోట్‌లోకి ప్రవేశించిన తాము అక్కడ బాంబులను వదిలి కేవలం 90 సెకన్లలో తిరిగి వచ్చేశాము. ఈ ఆపరేషన్ మొత్తం చాలా రహస్యంగా జరిగింది. దీని గురించి ఇంట్లో వారికి కూడా మేము చెప్పలేదు. కేవలం అధికారుల మధ్య మాత్రమే ఉండిపోయింది. ఇక దాడి తరువాత కూడా మేము ఈ విషయంపై ఇంట్లో మాట్లాడలేదు అంటూ ఆ పైలెట్ వెల్లడించారు.

అయితే.. ఈ దాడి తరువాత పాక్ కూడా ప్రతి దాడికి ప్రయత్నించగా.. దానిని భారత వాయుసేన తిప్పికొట్టిన విషయాన్ని వీరు వెల్లడించారు. ఆ క్రమంలో భారత పైలెట్ అభినందన్ వర్థమాన్ పాక్ విమానాన్ని కూల్చివేశాడని.. అయితే దురదృష్టవశాత్తు ఆయన విమానం కూలడంతో పాక్ బలగాలకు చిక్కాడని.. ఆ తరువాత పాక్ అతడిని విడిచిపెట్టిందని వారు పేర్కొన్నారు.

Source : Bharat Today

http://www.bhaarattoday.com/posts/view/balakot-air-strikes-complete-in-90seconds/3417