
179views
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్ను ఉద్దేశించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొరుగున ఉన్న దేశాలు చంద్రుడిపై కాలుమోపాయని, కానీ పాక్ మాత్రం భూమి మీదే ఎదగలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మన పొరుగున ఉన్న దేశాలు చంద్రుడి మీద అడుగుపెట్టాయి. మనం ఇంకా భూమి మీదే సరిగ్గా ఎదగలేకపోతున్నాం. మన పతనానికి మనమే కారణం. లేకపోతే మన దేశం మెరుగైన స్థితిలో ఉండేది’’ అని షరీఫ్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు 2013-17 మధ్య విద్యుత్ లోటు, ఉగ్రవాదం తదితర సమస్యలను పరిష్కరించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని, అయితే ఆ తరువాత అవన్నీ మరుగున పడ్డాయన్నారు.





