News

హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ యూఏవీని పరీక్షించిన భారత్‌

300views

భవిష్యత్‌తరం మానవరహిత పోరాట విమానాలను రూపొందించే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ మానవరహిత విమానా (యూఏవీ)న్ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత చేరినట్లయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ పరీక్ష జరిగింది. ఈ అటానమస్‌ లోహవిహంగాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించింది. ఇది బాణం మొన ఆకృతిలో ఉంటుంది. దీనికి తోక భాగం ఉండదు. నేల మీద నుంచి రాడార్లు, మౌలిక వసతులు, పైలట్‌ సాయం లేకుండా ఈ యూఏవీ సొంతంగా ల్యాండింగ్‌ నిర్వహించగలిగింది. దీని సెన్సర్‌ డేటాను స్వదేశీ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ రిసీవర్లతో అనుసంధానించడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, సైనికదళాలు, ప్రైవేటు పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అభినందించారు.