
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనకదుర్గమ్మ వారి ఆలయ విశేషాలు, అమ్మవారి చరిత్ర, భవానీ దీక్షల ఆవశ్యకత, గ్రామోత్సవాలను వివరిస్తూ అక్కడి ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రచార రథం ఇంద్రకీలాద్రి నుండి పయనమైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సర భవానీ దీక్షలు – 2023, హిందూ ధర్మప్రచారం నిమిత్తం శ్రీ అమ్మవారి ధర్మప్రచార రథంను విజయవాడ నుండి శ్రీకాకుళం జిల్లా వరకు పంపించేందుకు ప్రత్యేక పూజలను వైదిక కమిటీ సభ్యులు శంకర సాండిల్య ఆధ్వర్యంలో అర్చకులు పూజారులు నిర్వహించారు. ఈనెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని వివిధ గ్రామాలలో గ్రామోత్సవం నిర్వహించుటకు గాను వైదిక కమిటీ వారి ఆధ్వర్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి ప్రచార రథంను ప్రారంభించారు.





