
ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్కోట్ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్ల తోపాటు మరో ఇద్దరు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. వీరందరికీ కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. సాంజీ రామ్ కుమారుడు విశాల్ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
మొత్తం ఎనిమిదిమంది నిందితులు ఉండగా వారిలో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలపై ఛార్జ్షీట్ దాఖలైంది. మైనర్ మాత్రం ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో పఠాన్కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.





