
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దంపతుల రెండున్నరేళ్ల కుమార్తెను గొంతునులిమి చంపేశారు ఇద్దరు కిరాతకులు. అనంతరం ఆమె కనుగుడ్లను పీకారు. వివరాళ్లోకెళితే.. తప్పాల్ పట్టణంలో ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి ట్వింకిల్ శర్మ మృతదేహం మూడు రోజుల తర్వాత ఈ నెల 2న ఇంటి సమీపంలోని చెత్తకుప్ప వద్ద లభించింది. బాలిక మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఇంటిపక్కన నివసించే జహీద్, అస్లాంలను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. తీసుకున్న రూ. 10 వేల అప్పు చెల్లించలేదన్న ఒకే ఒక్క కారణంతో నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు చెబుతున్నా ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాలికపై అత్యాచారం జరిగుండే అవకాశాన్ని కూడా కాదనలేమని పోలీసులు, పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక వర్గం మీడియా దుర్ఘటనను కప్పిపుచ్చడానికి, చిన్నదిగా చూపడానికి ప్రయత్నించడం ప్రజల ఆగ్రహానికి కారణమౌతోంది. కుక్కలు పీక్కుతినటంతో పాప మృతదేహం బాగా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో ఏమి జరిగుంటుందనే విషయంలో వైద్యులు సైతం ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. కానీ పాప మరణించడానికి ముందే దారుణ హింసకు గురయిందని మాత్రం వైద్యులు స్పష్టం చేస్తున్నారు.





