
ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేసారు. రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ ప్రజల అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారని చెప్పారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం తాను ప్రార్ధిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడులకు ఏపీలో జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు హయాంలో జూన్ 2 నుంచి జూన్ 8 వరకు నవనిర్మాణ దీక్షలు..పునరంకిత సభలు నిర్వహించారు. జగన్ సీఎం అయిన తరువాత తిరిగి నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు నిర్ణయించారు. అందులో భాగంగా ఆ రోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ‘వైయస్ఆర్ ‘ అవార్డులు అందజేసింది.
విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సీఎం జగన్, విజయమ్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డులు అదించారు. వైయస్ఆర్ అవార్డుల్లో 23 లైఫ్టైం ఎచీవ్మెంట్, 4 ఎచీవ్మెంట్ అవార్డులు అందజేయనున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ పురస్కారాలు లభించాయి.





