
దసరా ఉత్సవాలలో అతి ముఖ్యమైనది రావణ దహనం. రావణుడి బొమ్మను దహనం చేయడాన్ని దసరా రోజున చాలా మంది ఆసక్తిగా తిలకిస్తుంటారు. కాగా, దేశంలోనే అతిపెద్ద లంకాధిపతి బొమ్మను హరియాణాలో ఏర్పాటు చేశారు. 171 అడుగుల ఎత్తైన ఈ బొమ్మను దసరా రోజున దహనం చేయనున్నారు.
పంచ్కుల జిల్లాలోని శాలిమార్ గార్డెన్లో రావణ బొమ్మను రూ.20 లక్షల వ్యయంతో శ్రీమాతా మన్సాదేవి ట్రస్ట్, ఆదర్శ్ రమిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిని దేశంలోనే ఎత్తైన రావణ బొమ్మగా భావిస్తున్నారు. దీని ఏర్పాటుకు 25 క్వింటాళ్ల ఇనుము వాడారు. 3వేల మీటర్ల చాప, వస్త్రాన్ని, ఒక క్వింటాల్ ఫైబర్ను ఉపయోగించి బొమ్మను తయారు చేశారు. రిమోట్ సహాయంతో రావణదహనం చేయడం ఇక్కడి మరో ప్రత్యేకత.
పర్యావరణహితంగా ఉండేందుకు రావణదహనానికి వాడే బాణసంచాపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు నిర్వాహకులు. దీనికోసం ప్రత్యేకంగా తమిళనాడు నుంచి మందుగుండు సామగ్రిని కొనుగోలు చేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రావణ దహన కార్యక్రమం కోసం అక్కడి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇంతకుముందు అంబాలాకు చెందిన తేజేంద్రసింగ్ రాణా అనే వ్యక్తి ప్రపంచంలోనే ఎత్తైన 220 అడుగుల రావణ దిష్టిబొమ్మను రూపొందించారు. ఆయన 2019లో చండీగఢ్లో ధనాస్ గ్రామంలో ఈ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. లక్షలాదిమంది దీనిని చూడడానికి తరలివచ్చారు.





