
గత ఏడాది ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘ది వాక్సిన్ వార్’ చిత్రాలతో సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తాజాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ‘మహాభారతం’ఆధారంగా తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తునట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.
కన్నడ రచయిత ఎన్.ఎల్.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన ‘పర్వ’ అనే పుస్తకాన్ని వివేక్ అగ్నిహోత్రి సినిమా రూపంలో తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని వివేక్ అగ్నిహోత్రి ప్రకటించారు. ఈ చిత్రానికి ‘పర్వ’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘ధర్మానికి సంబంధించిన ఓ పురాణకథ’ అనేది ట్యాగ్లైన్.
ఇలాంటి ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, త్వరలో ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.





