
అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన మహిళ నిలవబోతోంది. నిక్కీ హేలీ 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్ తరపున నామినేషన్ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వీళ్ల అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన హేలీ, 2024 రిపబ్లికన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడో విశేషం ఏంటంటే.. 2024 ఎన్నికల కోసం ట్రంప్కు తాను ఎట్టిపరిస్థితుల్లో పోటీదారురాలిని కాబోనని ఆమె రెండేళ్ల కిందట ప్రకటించారు. తాజాగా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారామె. ఇదిలా ఉంటే జో బైడెన్పై ఆమె కొంతకాలంగా విమర్శలు చేస్తూనే.. అధ్యక్ష పదవి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకత్వం ద్వారా రిపబ్లికన్ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం తన అభిమతమని ప్రకటించారు.





