
సువిశాల జలసాగరం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మరింత కీలకం కానుంది. దేశంలో తొలి అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును బంగాళాఖాతంలోని నికోబార్ దీవుల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అతి భారీ నౌకల ద్వారా సరుకు రవాణా కోసం విదేశాల్లోని ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడుతున్న అనివార్యతకు ఇది ముగింపు పలకనుంది.
దేశ భద్రత ప్రయోజనాలకు కీలక స్థావరంగా మార్చడంతోపాటు అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా నికోబార్ దీవుల్లోని ‘గలాటియా బే’ వద్ద అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టును నిర్మించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు, పశ్చిమ దేశాల సముద్ర మార్గానికి సమీపంలో నిర్మించనున్న ఈ పోర్టు అంతర్జాతీయ నౌకా రవాణాలో కీలకం కానుంది. అందుకు సన్నాహకంగా 2020లోనే కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్, నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్కు చెన్నై నుంచి సముద్రగర్భంలో 2,312 కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ట్రాన్షిప్మెంట్ పోర్టు నిర్మాణానికి రూ.41వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ చేపట్టింది.
ట్రాన్షిప్మెంట్ పోర్టు లేక ఆర్థిక భారం
అతి పొడవైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ భారత్కు అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టు లేకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. తూర్పు తీరం, పశ్చిమ తీరంలోని పోర్టుల్లో బెర్త్ల వద్ద గరిష్ట లోతు 8 మీటర్ల నుంచి 12 మీటర్లే ఉంది. దీంతో గరిష్టంగా 75 వేల టన్నుల కార్గో సామర్థ్యం కలిగిన కంటైనర్ నౌకలే ఈ పోర్టులకు వస్తున్నాయి. అంతర్జాతీయ లాజిస్టిక్స్ వ్యాపార ప్రమాణాల మేరకు 1.65 లక్షల టన్నుల నుంచి 1.80 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న కంటైనర్ నౌకల్లో సరుకు రవాణా జరుగుతోంది. అంత పెద్ద కంటైనర్లతో కూడిన నౌకలు రావాలంటే పోర్టుల్లోని బెర్త్ల వద్ద లోతు 12 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు ఉండాలి.
అటువంటి పోర్టు లేకపోవడంతో వివిధ దేశాల నుంచి వస్తున్న భారీ షిప్లను భారత్కు సమీపంలో ఉన్న సింగపూర్, కొలంబో, క్లంగ్ (మలేషియా), దుబాయిలోని అంతర్జాతీయ షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ 75వేల టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న కంటైనర్లలోకి మార్చి భారత్లోని పోర్టులకు రప్పించాల్సి వస్తోంది. భారత్ నుంచి 75 వేల టన్నులకు మించిన కార్గో రవాణా చేయాలంటే తొలుత చిన్న కంటైనర్లలో సమీప దేశాల్లోని అంతర్జాతీయ ట్రాన్షిప్మెంట్ పోర్టులకు తరలించి అక్కడ నుంచి భారీ కంటైనర్ ద్వారా గమ్యస్థానాలకు చేర్చాల్సి వస్తోంది. అందుకోసం హ్యాండ్లింగ్ చార్జీల కింద ఒక్కో కంటైనర్ యూనిట్ కోసం 250 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. భారత్ మొత్తం కార్గో రవాణాలో 25 శాతం నాలుగు విదేశీ ట్రాన్షిప్మెంట్ పోర్టులపై ఆధారపడాల్సి వస్తోంది. అందులో 40 శాతం కొలంబో పోర్టు ద్వారానే సాగుతుండటం గమనార్హం. దీంతో భారత్ ఏటా రూ.5వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది.
చైనా గుప్పిట్లో కొలంబో పోర్టు
కొలంబో పోర్టుపై చైనా ఆధిపత్యం మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోంది. శ్రీలంక ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా చేసుకుని చైనా అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చింది. కొలంబో పోర్టు పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. అందుకు ప్రతిగా కొలంబో పోర్టుపై చైనా నియంత్రణను అంగీకరించింది. ఒత్తిడికి లొంగి
చైనా యుద్ధ నౌకలు కొలంబో పోర్టులో లంగరు వేసేందుకు శ్రీలంక సమ్మతించింది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొలంబో పోర్టుపై ఆధారపడటం భారత్ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా సరైంది కాదని రక్షణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు.