NewsProgramms

భారతీయ కుటుంబ విలువలను సంరక్షించుకుందాం – శ్రీ భరత్ కుమార్

1.5kviews

నంద్యాలలోని పాన్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రధాన వక్తగా ఆరెస్సెస్ దక్షిణ మధ్య సహ క్షేత్ర ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.

ఆధునిక కాలంలో,అన్య మతాల సాంస్కృతిక దాడితో హిందూ సమాజంలో క్షీణిస్తున్న కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని శ్రీ భరత్ కుమార్ వివరించారు. పాశ్చాత్య దేశలలో లేనిది మన దేశంలో ఉన్నది కుటుంబ విలువలేనని తెలిపారు.

వారసులు లేని ఝాన్సీ లక్ష్మీబాయి ఒక బాలుని దత్తత స్వీకారానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదించక రాజ్యం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా అతి తక్కువ సైన్యంతో వీరోచితంగా పోరాడి అపర చండిలా ఆమె విజృంభించారని, అస్మదీయుల కుట్ర కారణంగానే ఆమె బ్రిటీష్ వారి చేతిలో మరణించారని శ్రీ భరత్ కుమార్ తెలిపారు.

మన పండుగలు , కుటుంబ జీవన విధానం, సామాజిక కార్యక్రమాలు కుటుంబాల యొక్క అనుబంధాలు అన్నీ మానవాళికి ఆదర్శనీయమని ఆయన తెలిపారు.

“ఉదరపోషణకు, ఉద్యోగ విషయంలో అవసరమైనపుడు బ్రిటీష్ వారి కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం. మన వారితో మాత్రం మాతృభాషలోనే మాట్లాడదాం. పతివ్రత, పుణ్యం లాంటి సరిసమానమైన పదాలు పాశ్చాత్య బాషలో లేనే లేవు.” అని తెలిపారు.

మతమార్పిడి భూతం విలయతాండవం చేస్తున్నదని, చర్చికి వెళ్ళే వాడు దశమభాగాలు ఇచ్చుకుంటూ అలాగే ఉన్నాడని, సైకిల్ పై ప్రచారం మొదలెట్టిన, చర్చిలు నడిపేవాడు మాత్రం కోట్లకు పడగలెత్తు తున్నాడని భరత్ కుమార్ వివరించారు. చాలా ప్రాంతాల్లో ఒక చర్చికి వెళ్ళే వాడు ఇంకో చర్చికి వెళితే కొట్టుకుంటున్నారని, మనలా ఏ గుడికైనా వెళ్ళే స్వాతంత్ర్యం వారికి లేదని తెలిపారు.

లవ్ జిహాద్ కు గురైన ఒక అమ్మాయి, బాధపడుతున్న వాళ్ళ అమ్మతో అన్న మాటలు మనందరి కళ్ళు తెరిపించే విధంగా ఉన్నాయి. “21 సంవత్సరాలు నన్ను పెంచిన నీవు అన్ని సౌకర్యాలు ఇచ్చి, ప్రేమతో పెంచావు కాదనను. ఏ రోజైనా మన ధర్మం గురించి, ఆచార వ్యవహారాల గురించి వివరించావా అమ్మా? ఆరు నెలల్లోనే వారు నాకు అరబ్బిక్, నమాజ్, బురఖా, వారి పద్దతులు అన్నీ నేర్పించారు.” అని చెప్పిందని తెలిపారు.

ఒక మాతృమూర్తి పుట్టిన రోజును మనదైన పద్దతిలో దీపాలు వెలిగించి, వచ్చిన వారి ఆశీర్వాదాలతో తీసిన వీడియో బాగా ప్రచారం పొంది చాలామంది ఆచరించడం ప్రారంభించారని తెలిపారు. మన దేశంలో 20% ఉన్న దుర్మార్గులు ఐక్యంగా ఉన్నారని, కానీ 80% ఉన్న మంచివారు అనైక్యంగా ఉండటం వల్ల దుర్మార్గుల మాటే చెల్లుబాటు అవుతున్నదని శ్రీ భరత్ కుమార్ చెప్పారు.

హిందువులందరూ కుటుంబ సమేతంగా ప్రతివారం గుడికి వెళ్ళడం అలవాటుగా మార్చుకోవాల్సిందిగా శ్రీ భరత్ కుమార్ సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.