
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడంలో, కోవిడ్ నియంత్రణ, నివారణ, చికిత్సలో వేల ఏళ్లనాటి భారతీయ ఆయుర్వేద వైద్యం ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న యోగా మరియు ఆయుర్వేద నిపుణులు, కోవిడ్ చికిత్సలోనూ, కోవిడ్ నుంచి బయటపడ్డ అనంతరం వాడవలసిన మందుల గురించి దేశవ్యాప్తంగా ఓకే ఏకీకృత విధానాన్ని అవలంబించే విషయమై కేరళ కేంద్రంగా ఉన్న వైద్యరత్నం సంస్థ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వర్చువల్ మీట్ లో చర్చిస్తున్నారు.
“తాజా అధ్యయనాల ప్రకారం, కోవిడ్ 3rd వేవ్ 18 సంవత్సరాల లోపు వయసున్న వారిని ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. నిపుణుల మార్గదర్శకత్వంలో శాస్త్రీయమైన పద్ధతుల ననుసరించి ఆయుర్వేద వైద్య విధానంలో ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం పైనే ప్రధానంగా ఈ ఏడాది దృష్టి సారించాము.” అని వైద్యరత్నం సంస్థ డైరెక్టర్ డాక్టర్ E.T. నీలకందన్ మూస్ తెలిపారు.
“ఈ సమావేశంలో నిపుణులతో చర్చించి చిన్న పిల్లలకు కోవిడ్ చికిత్సలో అనుసరించవలసిన వైద్య విధానాన్ని, అలాగే పెద్దలకు కోవిడ్ చికిత్స, అనంతరం అనుసరించవలసిన జాగ్రత్తలపై ఒక స్థిరమైన ఏకీకృత విధానాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నాము.” అని కూడా ఆయన తెలిపారు
ఈ సమావేశంలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన పలువురు ఆయుర్వేద వైద్య నిపుణులు, యువకులు మరియు చిన్నారులపై కోవిడ్ 3rd వేవ్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయంపై చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 3rd వేవ్ పరిణామాలను నిశితంగా గమనిస్తూ దాని నియంత్రణకు వేగవంతమైన చర్యలకు ఉపక్రమిస్తూ ఉంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, కోవిడ్ నివారణలపై అవగాహనను కలిగించేలా కొన్ని సూచనలను చేసింది.





