News

జులై నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ – ప్రధాని మోడీ వెల్లడి

851views

దేశంలో సరైన సమయంలో పెట్టిన లాక్‌డౌన్‌, ఇతర నిర్ణయాలు లక్షల మంది ప్రజల ప్రాణాల్ని కాపాడాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ఓ వైపు విజృంభిస్తున్న సమయంలోనే.. ఫ్లూ సీజన్‌ రాబోతోందని.. మున్ముందు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కల్పించేందుకు ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం ద్వారా 80కోట్ల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతోందని.. దీని కోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. కరోనా మృతుల విషయంలో ప్రపంచ దేశాల కన్నా మెరుగ్గానే ఉన్నామన్న ప్రధాని.. అన్‌లాక్‌ -1 తర్వాత ప్రజల వ్యవహారశైలిలో నిర్లక్ష్య ధోరణి కనిపించిందన్నారు.

బయటకెళ్తే మాస్క్‌ తప్పనిసరి!

”వర్షాకాలంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలోనే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. జులై నుంచి పండగలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో దీపావళి వరకూ ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన పొడిగిస్తున్నాం. ఐదు నెలల పాటు 80 కోట్ల మందికి 5కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు చొప్పున పంపిణీ చేస్తాం. ఇప్పటికే వ్యయం చేసిన ఖర్చును కలిపితే అన్న యోజన పథకానికి రూ.1.5లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం పాటించాలి”

దేశ ప్రధానికే రూ.13వేలు జరిమానా విధించారు..

”కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్‌ 2.0లోకి ప్రవేశించాం. ప్రతిఒక్కరూ కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. జలుబు, జ్వరం వంటి రకరకాల రోగాలు చుట్టుముడతాయి. ఈ సమయంలో ప్రతిఒక్కరం జాగ్రత్తలు పాటించాలి. లాక్‌డౌన్‌తో లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగాం. కంటైన్‌మెంట్‌ జోన్లపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించాలి. మాస్కు ధరించకుండా బయటకు వెళ్లినందుకు ఒక దేశ ప్రధానికే రూ.13వేలు జరిమానా విధించారు. అలాగే దేశంలోకి కూడా నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.

చట్టానికి ఎవరూ అతీతులు కారు

”దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారు. దేశ ప్రజల సహకారం ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించేలా చేసింది. దేశంలో కొన్ని రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. రాష్ట్రాలు ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గరీబ్‌ యోజన ద్వారా 20 కోట్ల కుటుంబాలకు రూ.31వేల కోట్లు నగదు జమచేశాం. అలాగే, 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18వేల కోట్లు జమచేశాం.

మన పోరాటం 130కోట్ల మందిని కాపాడుకొనేందుకే..

”లాక్‌డౌన్‌ పెట్టిన వెంటనే ప్రధాని గరీబ్‌ కళ్యాణ్‌ యోజనను తీసుకొచ్చాం. 9కోట్ల మంది రైతుల ఖాతాల్లో..ప్రధాని గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం, కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఒకే తరహా అప్రమత్తత ప్రదర్శించాలి. మన ఈ పోరాటం130మంది కోట్ల భారతీయులను కాపాడుకొనేందుకే” అని ప్రధాని నరేంద్రమోదీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.