
ఉగ్రవాద సంస్థ ఐసిస్తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన హీనా బషీర్ బేగ్కు కరోనా పాజిటివ్గా నిర్ణారణ అయింది. ఆమె కేసు కొద్దిరోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది. శ్రీనగర్కు చెందిన బేగ్, ఆమె భర్త జహాన్జైబ్ సమిను మార్చి తొలివారంలో దిల్లీకి చెందిన ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఐఎస్కేపీతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతోపాటు, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళలను రేకెత్తించడంలోనూ వీరి ప్రమేయమున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ భారత్లో భారీకుట్రకు యత్నిస్తుందన్న సమాచారం నేపథ్యంలో ఎన్ఐఏ వివిధ కేసులను దర్యాప్తు చేస్తోంది. బేగ్తోపాటుగా సమి, ఐసిస్తో సంబంధాలున్న మొహమ్మద్ అబ్దుల్లా బాసిత్ను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుంచి పనిచేస్తూ దేశంలో వివిధ చోట్ల దాడులు చేసేందుకు పలువుర్ని ప్రేరేపిస్తున్నట్లు గుర్తించి బసిత్ను 2018లో అరెస్ట్ చేశారు. గత తొమ్మిది రోజులుగా ఎన్ఐఏ హెడ్క్వార్టర్లో ఈ ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బేగ్లో కొవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆమెను పరీక్షలకు పంపించారు. ఫలితాల్లో ఆమెకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఎన్ఐఏ పాటియాలా హౌస్ మెజిస్ట్రేట్కు సమాచారం ఇచ్చింది. కోర్టు ఆమెను దిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించింది. ఆమె భర్త సమి, అబ్దుల్లా బాసిత్లో మాత్రం ఎలాంటి కరోనా లక్షణాలు లేవు.
అయితే ఆమెకు కొవిడ్ ఎలా సోకిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. బేగ్ కేసును విచారిస్తున్న అధికారులందరినీ కరోనా పరీక్షలకు వెళ్లి, క్వారంటైన్ నిబంధనలు పాటించాలని పై అధికారులు ఆదేశించారు. గత వారంలో ఓ ఎస్పీ సహా 7 నుంచి 8మంది అధికారులు ఆమెను విచారించినట్లు తెలిసింది.