
శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాల్గొని ప్రాణత్యాగం చేసిన ఐదుగురు భారతీయులకు ఐక్యరాజ్యసమితి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఈనెల 29న అంతర్జాతీయ శాంతిభద్రతల దినోత్సవం సందర్భంగా వీరిని డ్యాగ్ హామర్స్షోల్డ్ పతకాలతో గౌరవించనుంది. మేజర్ రవి ఇందర్ సింగ్ సంధు, సార్జంట్ లాల్ మనోత్ర తార్సేమ్, సార్జంట్ రమేశ్ సింగ్లతో పాటు పౌర సిబ్బందిగా శాంతి దళాల్లో సేవలందించిన జాన్షన్ బెక్, ఎడ్వర్ట్ ఆగాపిటో పింటోలు గత ఏడాది దక్షిణ సూడాన్, లెబనాన్, కాంగోలో విధి నిర్వహణలో అమరులయ్యారు. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వీరికి నివాళులర్పించి పతకాలతో గౌరవిస్తారు. అలాగే గత ఏడాది దక్షిణ సూడాన్లో యూఎన్ మిలటరీ పరిశీలకురాలిగా పనిచేసిన భారత సైన్యంలోని మహిళా మేజర్ సుమన్ గవాని ‘మిలటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ద ఇయర్ 2019’గా ఎంపికయ్యారు. ఈ నెల 29న నిర్వహించే ఆన్లైన్ వేడుకలో ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు.





