ఇప్పుడు అందరి చూపూ పూరీ జగన్నాథ్ రహస్య గదిపైనే వుంది. ఇప్పటికే రత్న భండార్ బయటి, లోపలి గదులను తెరిచి, విలువైన వస్తువులన్నింటినీ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కి తరలించే ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు మరో రహస్య టన్నెల్ వుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మరింత ఉత్సుకత పెరిగింది. అయితే.. అసలు రహస్య టన్నెల్ వుందా? లేదా? అన్న ఉత్కంఠతకు తెర దించడానికి ఏఎస్ఐ సహాయంతో ఆధునిక టెక్నాలజీతో పరిశోధించనున్నారు. లేజర్ స్కానింగ్ జీపీఆర్ఎస్ తో పరిశోధన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని పూరీ రాజు మహారాజా దివ్య సింఘాదేవ్ కూడా పేర్కొన్నారు.
రహస్య సొరంగం వుందో లేదో తెలుసుకోవడానికి లేజర్ స్కానింగ్ కోసం ఏఎస్ఐ అధునాతన పరికరాలను ఉపయోగిస్తుందని ఆయన వెల్లడించారు. భారత పురావస్తు శాఖ అధునాతన లేజర్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించి, సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత రత్న భండార్లో రహస్య గది వుందా? లేదా? అన్నది తెలిసిపోతుంది. దీని కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ను ఉపయోగిస్తారు. ఈ రాడార్ని ఉపయోగిస్తున్న సమయంలో ఓ సిగ్నల్ పంపిసార్తు. ఈ సిగ్నల్ తిరిగి వచ్చే సమయంలో ఓ ఇమేజ్ను తీస్తుంది. అప్పుడు అక్కడ ఏముందో తెలిసిపోతుందని నిపుణులు అంటున్నారు.