
భూమికి, చంద్రుడికి మధ్య నెట్వర్క్ను పెంచేలా, అంతరిక్ష ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చైనా రోడ్ మ్యాప్ను రూపొందించింది. కమ్యూనికేషన్ సూపర్ హైవే ద్వారా భూమిని చంద్రుడితో అనుసంధానం చేయాలని ఆ దేశం భావిస్తోంది. చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (సీఏఎ్సటీ), బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీరింగ్స్ పరిశోధకులు దీనికోసం కృషి చేస్తున్నారు. వారు ప్రతిపాదించిన ఈ సూపర్హైవే నెట్వర్క్లో 30 ఉపగ్రహాలతోపాటు భూమి, చంద్రుడికి మధ్య రియల్టైమ్ పర్యవేక్షణకు మూడు లునార్ గ్రౌండ్ స్టేషన్లు ఉంటాయి. వీటి ద్వారా.. ఆడియో గానీ, ఫొటోలు గానీ, వీడియోలు గానీ 20 లేదా అంతకంటే ఎక్కువ మంది అంతరిక్ష ప్రయాణికులు ఏకకాలంలో భూమిపై ఉన్న వారితో కమ్యూనికేషన్ చేసేలా చేయడం ఈ సూపర్హైవే సృష్టి ఉద్దేశం. వ్యోమనౌక భూమి, చంద్రుడి మధ్య ప్రయాణిస్తున్నప్పుడు జాబిల్లిపై జరిగే ఉపరితల కార్యకలాపాలను ఈ నెట్వర్క్ ద్వారా కచ్చితమైన స్థానం, నావిగేషన్, టైమింగ్తో సహా పొందవచ్చు. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న సిస్ లునార్ స్పేస్లో చిన్నగా ఒక మీటరు పరిమాణంలో ఉండే కదిలే లక్ష్యాలను కూడా ఈ నెట్వర్క్ పర్యవేక్షించగలదని ఈ ఏడాది జూన్లో వెలువడిన చైనీస్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో పరిశోధకులు వెల్లడించారు. మానవ కార్యకాలాపాలకు సిస్ లునార్ స్పేస్ కొత్త సరిహద్దుగా మారిందని చాంగ్స్-5 మిషన్ డైరెక్టర్ యాంగ్ మోంగ్ఫీ తెలిపారు.





