ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వెళ్తుంటారు. కొందరు వాహనాల్లో స్వామి దర్శనానికి వెళ్తే మరికొందరు నల్లమల అడవుల గుండా ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు పయమనవుతుంటారు. అయితే నల్లమల అడవుల ద్వారా శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసమే ఈ వార్త.
శ్రీశైలం వెళ్లే భక్తులు నల్లమల అడవుల్లోకి వెళ్లేందుకు ప్రవేశం నిషిద్ధం చేశారు అధికారులు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు పులుల ఏకాంత వేళగా నిర్ణయించబడింది. ఈ క్రమంలో సంతానోత్పత్తి సమయం కావడంతో ఎన్టీసీఏ ఆదేశాల మేరకు ఆగష్టు నుంచి నల్లమల అడవుల్లోకి ప్రజలకు ప్రవేశంపై అధికారులు పూర్తి నిషేధం విధించనున్నారు. మరోవైపు.. కొద్దిరోజులుగా మహానందిలో పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. చిరుత సంచారంతోప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చిరుతను బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం.. చిరుతను పట్టుకునేందుకు అధికారులకు అడ్డంకిగా మారింది.