
ముంబై పేలుళ్ళ సూత్రధారి, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్కు చెందిన ఓ నివాసంలో సనాతన ధర్మ పాఠశాల నిర్వహించబోతున్నారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడటంతో పాటు పలు నేరాల్లో దావూద్ కు భాగస్వామ్యం ఉన్నట్లు తేలడంతో అతడికి చెందిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేసింది.మహారాష్ట్రలోని ముంబాకే గ్రామపరిధిలోని నాలుగు ఆస్తులును వేలం వేయగా ఓ న్యాయవాది వీటిని రూ.2.01 కోట్లకు దక్కించుకున్నారు. వేలంలో ఫ్లాట్ కనీస ధరను రూ.15 వేలుగా నిర్ణయించారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం సర్వే నంబరు తనకు అనుకూలమని అందుకే ఎక్కువ అంత ధర వెచ్చించినట్లు తెలిపారు.
మహారాష్ట్ర రత్నగిరి జిల్లా ఖేడ్ తహశీల్ ముంబాకే లోని నాలుగు చోట్ల ఉన్న భూములు వేలం వేశారు. వీటిలో 171 చదరపు మీటర్లు ఉన్న భూమి ధర వేలంలో రూ.2.01 కోట్లు పలకగా మరో 1,730 చదరపు మీటర్ల స్థలం ధర రూ. 3.28 లక్షలు పలికింది. మరో రెండు ప్లాట్లకు ఎవరూ బిడ్ దాఖలు చేయలేదు.వేలంలో స్థలం దక్కించుకున్న శివసేన మాజీ నేత, న్యాయవాది శ్రీవాత్సవ మాట్లాడుతూ, త్వరలో ఆ స్థలాల్లో వేద పాఠశాల నిర్వహిస్తామని తెలిపారు. దావూద్ ఆస్తుల వేలం 2000 సంవత్సరంలో జరగగా ఎవరూ పాల్గొనలేదు. 2001లో మళ్లీ వేలం నిర్వహించగా శ్రీవాత్సవ పాల్గొని రెండు దుకాణాలు సొంతం చేసుకున్నారు. అయితే వాటిపై దావూద్ ఇబ్రహీం సోదరి వారసులు కేసు వేయడంతో న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు.





