
తమిళనాడులో వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. దక్షిణ భారతదేశంలో ఇక్కడ ఉన్నన్ని భారీ నిర్మాణాలతో కూడిన ఆలయాలు మరెక్కడా లేవు.వాటిలో వెల్లూరులో ఉన్న జలకండేశ్వర ఆలయం ఒకటి. ఇపుడు ఈ ఆలయం కేంద్రంగా ఓ వివాదం నెలకొంది. క్రీ.శ 1550 లో విజయ నగర రాజుల పాలన సమయంలో ఇక్కడ స్వయంబుగా చెప్పబడే శివలింగం ఉండేది. ఆ సమయంలో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. శివలింగం ఉన్న ప్రాంతం నీటితో నిండి ఉండడంతో ఈ ఆలయం జలకండేశ్వర ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఆలయం పురావస్తు శాఖ అధికారులు ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
1981లో ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని భావించినప్పటికీ, పురావస్తు శాఖ అధికారుల అనుమతి లేకపోవడంతో రహస్యంగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి జలకండేశ్వర ధర్మ స్థాపన అనే ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయం నిర్వహణ జరుగుతూ వస్తోంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆలయ నిర్వహణను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగేలా కోర్టు ద్వారా అనుమతి కోరింది. కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చినా ఆలయ నిర్వహణ చూస్తున్న జలకండేశ్వర ధర్మ స్థాపన ట్రస్టు సభ్యులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం, ట్రస్టు మధ్య వివాదం నడుస్తోంది.
ఆలయం వేలూరు ఫోర్ట్ ప్రాంగణంలో ఉంటుంది. ఆలయం లోపల కొన్ని రహస్య గదులు ఉన్నాయి. ఇక్కడికి భక్తులకు ప్రవేశం లేదు. గదుల్లో ఆలయానికి సంబంధించిన విలువైన సంపద అక్కడే భద్రపరుస్తారు. ఈ గదులను స్వాధీనం చేసుకునేందుకు పురావస్తు శాఖ అధికారులు బృందం ఆలయం లోకి వెళ్ళింది. అధికారులకు జలకండేశ్వర ధర్మ స్థాపన ట్రస్టు సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల బృందాన్ని ఆలయ ట్రస్టు సభ్యులు నిర్బంధించారు. అధికారులు తిరిగి రాకపోవడంతో సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. ఆలయానికి వెళ్లిన పోలీసులు అధికారులను బయటకు తీసుకు వచ్చారు. భక్తుల మనోభావలను దెబ్బతీస్తున్నారంటూ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రస్టుకు మద్దతుగా హిందూ సంఘాలు నిలిచాయి. తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. రహస్య గదుల్లోని సంపదను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు.





