
గడిచిన సంవత్సర కాలంగా లండన్లో, ఇతర చోట్ల హిందువులపై విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నా పోలీసు రికార్డులలో అవి నమోదు కావడం లేదని బ్రిటన్లోని భారత సంతతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మతాలవారీగా విద్వేష నేర గణాంకాలను నమోదు చేయాలని కోరుతూ గతవారం బ్రిటిష్ భారతీయ సభ్యుడు కృపేశ్ హిరానీ ప్రతిపాదించిన తీర్మానాన్ని లండన్ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ సాదిక్ ఖాన్ నాయకత్వంలోని గ్రేటర్ లండన్ అథారిటీలో భాగమైన లండన్ అసెంబ్లీ నగరవాసుల సమస్యలను పరిశీలించి పరిష్కారాలు ప్రతిపాదిస్తుంది. నగరం లోపల, ఇతర చోట్ల పెరుగుతున్న హిందూ ద్వేషాన్ని హిరానీ ఈ అసెంబ్లీలో ప్రస్తావించారు. 2021-22లో హిందువులపై 161 విద్వేష నేరాలు జరగ్గా, 2022-23లో అవి 291కి పెరిగినట్లు బ్రిటన్ హోం శాఖ కార్యాలయం తెలిపిందని హిరాని గుర్తుచేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు హిందువులతో కలిసి పని చేయడం ద్వారా వారిలో భరోసా పెంచాలని కోరారు.





