News

దీపావళికి ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ రైల్వే

389views

పండుల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతీసారి ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లను నడిపే విషయం విదితమే.. అయితే, దీపావళి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది దక్షిణ రైల్వే.. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.. ఈ నెల 13, 20, 27 తేదీల్లో 06073 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు నడపనుంది.. రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరనున్న ఈ రైలు మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. ఇక.. ఈ నెల 14, 21, 28 తేదీల్లో 06074 భువనేశ్వర్‌-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు.. రాత్రి 9 గంటలకు భువనేశ్వర్‌లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకోనుంది.. ఈ రైళ్లు గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు స్టేషన్లలో ఆగుతాయని తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే..

ఇక, చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది రైల్వే శాఖ.. ఈ నెల 11, 18, 25 తేదీల్లో 06071 డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు నడవనుంది.. ఆ తేదీల్లో చెన్నై సెంట్రల్‌లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మూడవ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకోనుంది.. 13, 20, 27 తేదీల్లో 06072 నంబర్‌ కలిగిన సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. సంత్రాగచ్చిలో తెల్లవారుజామున 5 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోనుంది.. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతాయని తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే.

మరోవైపు.. విజయవాడ రైల్వే డివిజన్‌లో మరమ్మతుల కారణంగా బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది.. గతంలో ఈ నెల 5వ తేదీ వరకు ఆ రైలును రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా.. తాజాగా 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.. అలాగే, కాట్పాడి-తిరుపతి-కాట్పాడి ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 12వ తేదీ, అరక్కోణం-కడప-అరక్కోణం మెము రైళ్లను ఈ నెల 12వ తేదీ వరకు రద్దు చేసినట్లు తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే.